గో మాత వైభవం:- జీవిత సాఫల్యం ,

Aug 8, 2021 - 11:15
 0
గో మాత వైభవం:- జీవిత సాఫల్యం ,

గో మాత వైభవం:-

జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" ఈ లోకంలో నాలుగు  రూపాలతో ఉంటుంది. వారు:-

  1. జనక మాత - మనకు జన్మ ఇచ్చిన అమ్మ (కన్న తల్లి)
  2. గో మాత - గోవు (ఆవు)
  3. భూ మాత - భూదేవి (భూమి)
  4. శ్రీ మాత - దేవాలయాలలోని అమ్మవారు (సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గా దేవి, కాళికా దేవి, చౌడేశ్వరి దేవి, etc మరియు గ్రామ దేవతలు - గంగమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, అంజేరమ్మ, ఆరేటమ్మ, చెంగాళమ్మ, etc)

మనకు కష్టాలు, బాధలు వచ్చినపుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ నాలుగు  రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనలను కాపాడుతుంది.

గో మాత:-

జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" యొక్క 1000 నామాలలో (శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లో) "గోమాతా" అనే పేరు ఒకటి. అంటే "గో మాత" సాక్షాత్తూ పరదేవత యే (శ్రీ ఆదిపరాశక్తి యే). కనుక గోమాత "శ్రీ లలితాంబికా దేవి" యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు.

  1. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే.
  2. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తూ పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే.
  3. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు పూజ చేసినట్లే.
  4. గర్బగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి, మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు అలంకరణ చేసినట్లే.
  5. గోవులు, దూడలు నేల మీద నడిచి వెళుతుంటే, వాటి వెనుకన మనం నడిచినపుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి, దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపై ఉంది.
  6. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడూ శుభమే జరుగుతుంది.

అటువంటి గోవు మీద acid పోయడం, గోవును హింసించడం, గోవును చంపడం చేస్తే సాక్షాత్తూ పరదేవతను అవమానించినట్లే. ఇలా చేయడం మహా పాపం.

పంచ మహా పాతకాలలో "గో హత్యా మహా పాతకం" ఒకటి.

ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి. గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు "గోవిందుడు" (గోవులను రక్షించువాడు - శ్రీ మహా విష్ణువు). గోవులకు హాని చేసి, తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవతా అనుగ్రహం లభించదు.

"గో" అనగా --- గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అని అర్థం. వీటినన్నింటినీ రక్షించువాడు "గోవిందుడు".

గోమాత జననం:

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి.

అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో వేదంలో నాల్గవ  కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.

ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు. సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం.

ఆ సురభిరోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. ‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’ ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది.

అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు. వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.

స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు. ‘‘ధేనునా మస్మి కామధుక్" అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం.

దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది. సురభి ఒక్కసారి తపస్సునారంభించనది.

బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.

ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే! స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.

గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది. ‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు.

మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.

గో పూజ పరదేవతా పూజ. గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.

వేదం గోవుని ఏమని చెప్పిందంటే "గౌరగ్నిహోత్రః" అంది. గోవు "అగ్నిహోత్రము". అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతీ రోజూ యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో, అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు పృష్ట భాగమునందు కాస్త పసుపు, కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్ధానములు ఐదే.

  1. ఏనుగు కుంభస్థలం
  2. ఆవు వెనక తట్టు
  3. తామరపువ్వు
  4. బిళ్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం
  5. సువాసిని పాపట ప్రారంభస్ధానం.

అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా!

గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్నాడని, మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు.

గో సహస్రమని తప్ప, ఒక్క గోవుని దానం చేసాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. మీకొక రహస్యం చెప్పనా! గోసేవ చేసాడనుకోండి, గోగ్రాసం పెట్టాడనుకోండి.

అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి, ప్రదక్షిణం చేసి, గంగడోలు ఇలా దువ్వి, గోవు పృష్టభాగంలో పసుపు, కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం! ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కపెడతాడు. (chaganti koteswar rao gari video la adharam ga rasinadhi )

ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేసారని లెక్క వేస్తారు. "కామాక్షి పరదేతకు అరటిపండు తినిపించడం సాధ్యంకాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితమూ వస్తుంది".

గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే.

"గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ "

"గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!"

భావముః గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము). శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము. గోమహత్యముః :

  • గోపాదాలు - పితృదేవతలు,
  • పిక్కలు - గుడి గంటలు,
  • అడుగులు - ఆకాశగంగ,
  • కర్ర్ఇ - కర్ర్ఏనుగు,
  • ముక్కొలుకులు - ముత్యపు చిప్పలు,
  • పొదుగు - పుండరీకాక్షుడు,
  • స్తనములు- చతుర్వేదములు,
  • గోమయము - శ్రీ లక్ష్మి,
  • పాలు - పంచామృతాలు,
  • తోక - తొంబది కోట్ల ఋషులు,
  • కడుపు - కైలాసము,
  • బొడ్డు - పొన్నపువ్వు,
  • ముఖము - జ్యేష్ఠ,
  • కొమ్ములు - కోటి గుడులు,
  • ముక్కు - సిరి,
  • కళ్ళు - కలువ రేకులు,
  • వెన్ను - యమధర్మరాజు,
  • చెవులు - శంఖనాదము,
  • నాలుక - నారాయణ స్వరూపము,
  • దంతాలు - దేవతలు,
  • పళ్ళు - పరమేశ్వరి,
  • నోరు - లోకనిధి.
  • ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము.
  • పూజించుట మోక్షప్రదము.

స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది. ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు, రాత్రి పూటపఠిస్తే యమబాధలు వుండవు.

గోమహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము, సంధ్యవేళ గోమహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది. కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది. నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి. విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.

ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము. కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలము చదవటము మాత్రమే, చదివి పుణ్యమును సంపాదించుకోవటము ఎంతసులభము. అయినా చదవలేకపోతే మన చేతులారా మనల్ని మనము దిగజార్చుకోవటమేనేమో?

గావో విశ్వస్య మాతరః :-

గావో మమాగ్రతస్సంతు , గావో మే సంతు పృష్ఠతః !

గావో మే హృదయే సంతు , గవాం మధ్యే వసామ్యహం !!

గోవు నా ముందు నా వెనుక , నా హృదయంలో ఉండాలి . నేను ఎల్లప్పుడూ గోవుల మధ్యలో ఉండాలి . అంటే నేను గోవులమధ్యలో ఉంటే సురక్షితంగా ఉంటానని .

రాళ్ళు వద్ద పుత్రుడుంటే పుత్రునకు ధైర్యం కలుగుతుంది . తల్లి దగ్గర ఉంటే నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అని ధైర్యం . అలాగే గోమాత దగ్గర ఉన్న మనల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు . మనం శ్రీకృష్ణుడిని పూజిస్తాము , శ్రీకృష్ణుడు గోవుల మధ్యలో ఎక్కువగా గడిపేవాడు .

గోవులు కృష్ణునకు చాల ప్రియమైనవి . అందువలన గోసేవ మనకు ప్రథమ కర్తవ్యం . గోవులను ఎక్కడ సేవిస్తారో ఆ ప్రదేశం పవిత్రమైంది .

గోవులను సురక్షితంగా ఉంటె ఆ స్థలం పవిత్రమైనది . గోవులను సేవించి భగవంతుని కృపకు పాత్రులం కాగలం .

గోమాత వస్తువులను వాడండి, గోవును రక్షించండి.. పవిత్ర కార్తీక మాసంలో ఆవునేతి దీపాలు వెలిగించండి.. జై గోమాత జైజై గోమాత గోమాత పాదాలకు శతకోటి వందనాలు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow