రామనాథ స్వామి దేవాలయం - రామేశ్వరం ద్వీపంలో

Aug 5, 2021 - 10:24
 0
రామనాథ స్వామి దేవాలయం - రామేశ్వరం ద్వీపంలో

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు, తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు.

ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడింది.

ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు, స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది.

ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్తంభం అని అర్థం.

ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించు కోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలను కుంటాడు.

రాముదు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని అనుకోని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.

ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది.

ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు "విశ్వలింగాన్ని" మొడట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.

దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయానికి కూడా అతి పెద్ద ప్రహరీ గోడ నాలుగు వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరము 657 అడుగులు.

దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి, మధ్యలో అధికంగా ఐదు అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి.

రెండవ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైనది. మూడవ కారిడార్ యొక్క పశ్చిమ వైపు, పశ్చిమ గోపురం నుండి సేవుమాథవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది.

ఇది "చొక్కట్టన్ మండపం"గా ప్రసిద్ధి చెందింది. ఇచట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతి చే నిర్వహింపబడుతున్న ముఖ్య పండగలైన అయిన ఆది (జూలై-ఆగష్టు) , మాసి (ఫిబ్రవరి-మార్చి) తర్వాత ఆరవ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు.

బయటి కారిడార్ సముదాయము 6.9 మీటర్లు ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరలకున్నూ , 640 అడుగులు ఉత్తర దక్షిణలకున్నౌ కలిగి ప్రపంచంలోనే పెద్దదిగా చరిత్ర సృష్టించింది. అంతర కారిడార్ 224 అడుగుల తూర్పు పడమరలకున్నూ, 352 అడుగులు ఉత్తర దక్షిణలకున్నూ విస్తరించి ఉంది.

వాటి వెడల్పు 15.5 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకున్నూ , 14.5 నుండి 17 అడుగుల వెడల్పుతో 172 అడుగులు ఉత్తర దక్షిణాలకున్నూ విస్తరించి ఉంది.

ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి. వాటి ఎత్తు భూమినుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా "రాజగోపురం: 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్థాంబాలు వ్యక్తిగత కూర్పుతో చెక్కబడినాయి.

ఆలయ సముదాయంలో , రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు ఇచట రామనాథస్వామి , విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్ తో వేరుచేయబడినాయి. ఇచట విశాలాక్షి,పర్వతవర్ధిని,ఉత్సవ విగ్రహం,శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి.

ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుప్పు మండపం, సుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం , నంది మండపం. జ్యోతిర్లింగాలు.

భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు (పవిత్ర జల భాగాలు) ఉన్నాయి. స్కాంద పురాణం ప్రకారం, వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు.

వాటిలో 22 తీర్థములు రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సఖ్య రాముని యొక్క అమ్ములపొదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం "అగ్ని తీర్థం". అది బంగాళా ఖాతం సముద్రం.

ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల "చార్‌దామ్" (నాలుగు ఆధ్యాత్మిక స్థలాలు) లలో ఒకటి. మిగిలినవి భద్రీనాథ్, పూరీ, ద్వారక లు.

దీని మూలములు కచ్చితంగా తెలియనప్పటికీ, అద్వైత మత పాఠశాలను ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. ఆయన హిందూ సాథు సంస్థలను భారత దేశ వ్యాప్తంగా నెలకొల్పినట్టు ఆధారాలున్నాయి. ఇచట చార్‌ధామ్‌ లలో ఒకటిగా ఈ దేవాలయాన్ని నెలకొల్పినట్లు ఆధారాలున్నాయి.

భారత దేశం నలుమూలలా నాలుగు మఠాలు నెలకొల్పాడు. వాటిలో ఉత్తర భాగాన భద్రీనాథ్ లో భద్రీనాథ్ దేవాలయం, తూర్పున పూరీలో జగన్నాథ దేవాలయం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ దేవాలయాన్ని, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాలను నెలకొల్పాడు.

సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూమత శాఖలైన శైవ, వైష్ణవ శాఖలుగా విభజించబడినప్పటికీ, చార్‌ధామ్‌ అందరు హిందువులకూ ప్రసిద్ధ యాత్రా స్థలాలుగా భాసిల్లాయి.

ఛోటా చార్‌ధామ్‌ పేరుతో హిమాలయాలలో నాలుగు నిలయాలున్నాయి ("ఛోటా" అనగా "చిన్న" అని అర్థము). అవి : భద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ నాలుగు క్షేత్రాలు కూడా హిమాలయాల దిగువ ప్రాంతాలలో ఉన్నాయి.

20 వ శతాబ్దంలో అసలైన చార్‌ధామ్‌ లకు ఈ నాలుగు చార్‌ధామ్‌ల మధ్య గల భేదాలను బట్టి హిమాలలోని ఈ క్షేత్రాలకు "ఛోటా చార్‌ధామ్‌" అని పేరిడినారు. ఈ నాలుగు క్షేత్రాలను సందర్శించుట అనునది హిందువులలో పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు.

జీవితంలో ఒకసారైనా వీటిని సందర్శించాలనేది హిందువుల నమ్మకం సాంప్రదాయకంగా ఈ ప్రయాణం తూర్పున పూరీ నుండి ప్రారంభమై సవ్యదిశలో ప్రయాణిస్తూ మిగిలిన మూడింటినీ సందర్శించాలి.

శివ పురానం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు, తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది .దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు.

ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.

ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో అదిని కనుక్కోవడానికి బయలు దేరాడు.

బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు, బ్రహ్మకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు.

ఆవు కనపడితే అదే విధంగా చెప్పి, ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు.

సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను. రెండు, కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.

బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు, బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది.

బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు.

విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు యేర్పరచిన "జ్యోతిర్లింగం" అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి.

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి.ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం "లింగము" .

ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం.

ఈ జ్యోతిర్లింగాలు

  • గుజరాత్ లోని సోమనాథుడు,
  • శ్రీశైలం లోని మల్లిఖార్జునుడు,
  • ఉజ్జయిని లోని మహాకాళేశ్వరుడు,
  • మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు,
  • హిమాలయాలలోని కేదారినాథుడు,
  • మహారాష్ట్ర లోని భీమశంకరుడు,
  • వారణాశి లోని కాశీ విశ్వనాథుడు,
  • మాహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు,
  • డియోగర్ లోని వైద్యనాథుడు,
  • ద్వారక లోని నాగేశ్వరుడు,
  • తమిళనాడులోని రామేశ్వరుడు,
  • ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు.

ఈ దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. తంజావూరును పరిపాలించు మహారాజులు "సత్రం" లేదా విరామ భవనాలను నిలకొల్పారు. ఇవి మయిలాదుతురై, రామేశ్వరం మధ్య 1745, 1837 లలో నెలకొల్పారు. వీటిని దేవాలయానికి విరాళంగా యిచ్చారు.

రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు.

రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.

దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన (పాంబన్ రైలు వంతెన), రోడ్డు వంతెన (ఇందిరా గాంధీ వంతెన) ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్లో కూర్చుని సుర్యోదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతత చేకూరుతుంది. చెన్నై నుండి రామేశ్వరానికి దినసరి రైళ్ళు గలవు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow